5, మే 2013, ఆదివారం

సామాన్యుడి పాదయాత్ర

రాష్ట్రంలో పాదయాత్రల హడావిడి జోరుగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు తన యాత్ర ఎట్టకేలకు ముగించారు. ముగింపు వేడుక కూడా భారీ ఎత్తున నిర్వహించి నభూతో నభవిష్యతి అన్న చందాన పూర్తి చేశారు. బానే ఉంది. పాపం... పెద్దాయన నానాయాతనలు పడి రాత్రింబవళ్ళు తిరిగి గొప్ప సింపతీ సంపాదించుకున్నారు. మన కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాడ్రా... అని సామాన్య జనం అనుకునే రీతిలో తెగ తిరిగేశారు. ఏడు నెలల తర్వాత ఇంటికి చేరుకున్నారు. మరొపక్క బాబు యాత్ర మొదలయిన కొద్దిరోజుల తర్వాత హడావిడిగా ఆరంభమైన షర్మిలమ్మ పాదయాత్ర ఇంకా కొనసాగుతోంది.మధ్యలో పాపం కాలు ఇబ్బంది పెట్టడం వల్ల కొంతకాలం ఆగిన ఈ యాత్ర మళ్ళీ మొదలై జరుగుతోంది. జగన్మోహన్‌ రెడ్డి జైలులో ఉన్న కారణంగా ఏదో ఒక యాక్టివిటీ లేకపోతే క్యాడర్‌ లో నిరుత్సాహం పెరుగుతుందనే భయంతోనే ఈ యాత్ర చేస్తున్నారంటూ ఎగస్పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదిఏమయినా షర్మిల మాత్రం పంటి బిగువున యాత్ర కంటిన్యూ చేస్తున్నారు. అదో టైపు. ఇంకో పక్క మన సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఏదో ఒక పేరు పెట్టుకుని నిత్యం ఏదో ఒక ప్రాంతం కవర్ చేస్తున్నారు.తెగ కష్టపడుతున్నాడు. బయట సంగతి సరే.. స్వంత పార్టీలోనే ఆయనకు మద్దతు లేదు. ప్రతిరోజూ కాంగ్రెస్ నాయకులే ఆయనను దారుణంగా విమర్శిస్తున్నారు. ఏమయినా మిగిలితే అపోజిషన్ పార్టీలు పంచుకుంటున్నాయి. అక్కడికీ ఆయన 'అమ్మహస్తం' అనో 'అభయ హస్తం' అనో 'ఇందిరమ్మ కలలు' అనో నానారకాల పేర్లు పెట్టుకుని ఊళ్ళు చుట్టేస్తున్నారు. ఇదో టైపు. ఇక నారాయణ, రాఘవులు సంగతి సరేసరి. పాదయాత్ర అనే పేరు లేకపోయినా వాళ్ళెప్పుడూ రోడ్ల మీదే ఏదో ఒక ఉద్యమం పేరుతో నడుస్తూనే ఉంటారు.వాళ్ళదో టైపు. మిగతా పార్టీల సంగతి సరేసరి... వీలు కుదిరినప్పుడల్లా కిలోమీటరో అర కిలోమీటరో పాదయాత్ర చేస్తూనే ఉంటారు. ఏతావాతా ఎవరి ఆశయాలు వారివి.. ఎవరి ఆలోచనలు వారివి.. ఎవరి రాజకీయ కోణం వారిది. వాటి గురించి విశ్లేషించేందుకు మనమెవరం? దాన్ని కాస్సేపు పక్కన పెడదాం.

 కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ పాదయాత్రల ఎపిసోడ్ పురాణకాలంలోనే మొదలయింది. అన్న రాముడి మీద దిగులుతో తల్లి పరంగా ఏర్పడిన చిన్న గిల్టీ ఫీలింగుతో భరతుడు శ్రీరామ చంద్రుడి పాదుకలు నెత్తిన పెట్టుకుని ఆ రోజుల్లోనే మైళ్ళ కొద్దీ తిరిగాట్ట. తండ్రికిచ్చిన మాట కోసం భార్య సీతను తీసుకుని లెక్కలేనన్ని కిలోమీటర్ల దూరం రాములవారు అరణ్యాల్లో బోల్డంత దూరం చుట్టేశాడు.మితిమీరిన
 ఆత్మవిశ్వాసంతో జూదమాడి అన్నీ కోల్పోయి భార్య, తమ్ముళ్ళతో కలిసి పన్నెండేళ్ళ పాటు అడవులు పట్టుకుని ధర్మరాజు ఫ్యామిలీ అప్పట్లోనే పాదయాత్రలు చేశారు. రాముడి ఆదేశం మేరకు జానకీ మాతను వెదికేందుకు బయల్దేరిన ఆంజనేయస్వామికి ఎగిరే సౌకర్యం ఉంది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఆయన కూడా పాదయాత్ర చేయక తప్పేది కాదు. భారతీయ సంస్కృతీ వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటేందుకు గానూ ముప్ఫయి రెండేళ్ళ వయసులోనే నాలుగుసార్లు భారత దేశం చుట్టి వచ్చిన జగద్గురువు ఆదిశంకరుడు ఆ రోజుల్లోనే పాద యాత్రల రికార్డు నెలకొల్పాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి.

పాదయాత్ర అంటే ఇంగ్లీష్‌లో వాకింగ్ అని అర్థం. గత దశాబ్ద కాలంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ అంతకు ముందు కంటే జనంలో బాగా పెరిగింది. తెల్లవారు ఝామునే లేచి బుల్లి నిక్కర్లు, చేతిలో కర్ర, షూస్ ధరించి కిలోమీటర్ల మేర నడిచేవారి సంఖ్య పెరిగిపోయింది. ఈ విషయంలో ఆడవారు కూడా ఏమీ తీసిపోలేదు. ప్రపంచ రాజకీయాలన్నీ ఈ కాసేపట్లోనే చర్చకొస్తాయి. ఆత్మస్తుతి, పరనింద ఈ గంటలో రాజ్యమేలుతాయి. ఆ వాకింగు కాస్తా పూర్తవగానే ఎవరిదారి వారిది.. మర్నాడుదయం దాకా ఎవడిగోలవాడిది... ఒక విధంగా ఈ వాకర్స్ కూడా పాద యాత్రికులే కదా..

బిడ్డకు రెండో సంవత్సరం వచ్చినప్పటి నుంచే వాళ్ళ స్కూళ్ళ సీట్ల కోసం డొనేషన్లు కట్టలేక తమ స్తోమతుకు తగ్గ విద్యా కర్మాగారాల కోసం తల్లిదండ్రులు కొన్నాళ్ళపాటు కాళ్ళరిగిపోయేలా తిరుగుతూనే ఉంటారు. అదీ ఒక రకంగా పాద యాత్రే కదా... గుండెల మీద ఉచిత గ్యాస్ స్టవ్ లాగా ఎదిగొచ్చిన ఆడపిల్ల పెళ్ళి కోసం ఎక్కే గడపా, దిగే గడపా రీతిలో కాళ్ళకు బలపం కట్టుకుని తిరిగే అమ్మాయిల తండ్రులు మ్యారేజి బ్యూరోల చుట్టూ పెళ్ళిళ్ళ పేరయ్యల ఇళ్ళ చుట్టూ తెగ తిరుగుతుంటారు.ఇదో టైపు పాదయాత్ర. 

ఖరీదైన కార్పొరేట్ స్కూళ్ళలో చేరేందుకు డబ్బుల్లేక, వెళ్ళేందుకు బస్సుల్లేని సర్కారీ బడుల్లోనే చేరి నిత్యం నాలుగైదు కిలోల బరువున్న పుస్తకాల గోతాన్ని భుజాన వేసుకొని పొద్దునా సాయంత్రమూ తిరిగే నిరుపేద విద్యార్థులది పాదయాత్ర కాదూ...! పెన్షన్ల కోసం గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ రెండుపూటలా మూడువందల అరవై రోజులూ ఏదో మొక్కు తీర్చుకుంటున్నట్టు తెగతిరిగేసే లంచాలిచ్చుకోలేని రిటైర్డ్ ఉద్యోగుల పాదయాత్రల గురించి ఏం మాట్లాడ తాం చెప్పండి.

నిస్సిగ్గుకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన నాగరిక సమాజం సాక్షిగా ఈ రోజుకూ భుజాన బిందెలు మోసుకుంటూ గుక్కెడు మంచినీళ్ళకోసం కిలోమీటర్ల దూరం మండుటెండల్లో నడిచి వెళ్ళొచ్చే నా జాతి ఆడపడుచులది కన్నీటి పాదయాత్ర కాదూ..! ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని పాదయాత్రలు.. బతుకునీడ్చేందుకు నానా చావు చస్తున్న ఈ దేశ పౌరులు తమ నిత్య జీవన ప్రస్థానంలో వేసే ప్రతి అడుగూ పాద యాత్రకు నాంది ప్రస్తావనే.

అసలు పెళ్ళిళ్ళప్పుడు నూతన వధూవరులచేత ఏడడుగులు ఎందుకు వేయిస్తారో తెలుసా... ఇప్పటిదాకా ఎంత సుఖపడ్డారో తెలీదు కానీ, భవిష్యత్తు జీవన ప్రయాణంలో ఎన్నో లక్షల కిలోమీటర్లు బతకటం కోసం నడవాల్సి ఉంటుంది కాబట్టి అందుకు ప్రాక్టీసుగా ముందు ఓ ఏడడగులు వేయండీ అని.. ఈ ఏడడగుల పాదయాత్రకు మరో అర్థం కూడా అన్వయించుకోవచ్చు...

మొదటి అడుగు జీవితంలో స్థిరపడేందుకు. రెండో అడుగు సంతానాన్ని స్థిరపరచేందుకు.. మూడో అడుగు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేందుకు... ఎదిగొచ్చిన కొడుకు గుండెల మీద తన్ని పెళ్ళాంతో లేచిపోతే దాన్ని తట్టుకుని నిలదొక్కుకునేందుకు నాలుగో అడుగు.. కడుపున పుట్టిన బిడ్డలు ఎంచక్కా ఆస్తులు పంచేసుకుని తమను వదిలి వెళ్ళిపోతే అడుగులు తడబడే వయసులో వృద్ధాశ్రమాల వైపు నడిచేందుకు అభ్యాసంగా అయిదో అడుగు..భర్తను వదిలి భార్యో, భార్యను వదిలి భర్తో ముందుగా కన్నుమూస్తే ఆ ఎడబాటును తట్టుకుని ఒంటరితనం వైపు పయనించేందుకు ప్రాక్టీసుగా ఉండటం కోసం ఆరో అడుగు.. మమతానుబంధాలను తెంచుకుని ఊపిరి గాల్లో కలిపిసోతే రుద్రభూమి వైపు పార్థివ దేహాల మహాయాత్రకు గురుతుగా ఏడో అడుగు... ఇది పక్కన పెడితే జీవితంలో ఆచితూచి అడుగేయండి అంటారు మన పెద్దవాళ్ళు... ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా మన జీవన ఘన పాదయాత్రల్లో కాళ్ళు వణుకుతాయని.. బెణుకుతాయని.. కాబోలు..!

1 కామెంట్‌: