10, అక్టోబర్ 2010, ఆదివారం

తరువాత ఎవరు.........?

     కొన్ని రంగాల్లో కొంతమంది తరువాత ' ఎవరు ' అన్న ప్రశ్నకు వెంటనే సమాధానం దొరకదు.ఓ ఎన్టీయార్ తర్వాత ' ఎవరు ' అన్న ప్రశ్న ప్రశ్నగానే ఇప్పటికి మిగిలిపోయింది. బహుశా కనుచూపు మేరలో సమాధానం దొరికే అవకాశం కూడా కనిపించటం లేదు. ఘంటసాల తరువాత బాలు ఆ స్థానాన్ని పూర్తిగా కాకపోయినా చాలావరకు భర్తీ చేశారు... ఘంటసాల తర్వాత బాలు అనే కీర్తిని స్వంతం చేసుకున్నారు.అందుకుగాను బాలు చేసిన కృషి సామాన్యమైనది కాదు.అయితే బాలు తరువాత ఎవరు అనే ప్రశ్నకు ఆన్సరు లేదు. ఘంటసాల, బాలు లాగా సుదీర్ఘకాల భవితవ్యాన్ని ప్రకటించుకున్న గాయకుడు కనిపించటం లేదు. వాళ్ళు ఇద్దరు సోలోగా కొన్ని దశాబ్దాలు తమ స్వంతం చేసుకున్నారు. కాని బాలు తరువాత గాయకుల సముదాయం తప్పితే ' సోలోగిరి ' అనే ప్రసక్తి లేదు. ఘంటసాల తరువాత బాలు అని కాన్ఫిడెంట్ గా చెప్పిన మనం ' బాలు తరువాత?' అని అడిగితే టక్కున ఏ ఒక్క గాయకుడి పేరు చెప్పలేని పరిస్థితి...తరువాత వచ్చిన వారిలో ఎక్కువమంది పరభాషా గాయకులు..ఉదిత్ నారాయణ్, శంకర్ మహదేవన్, హరిహరన్ లాంటి గాయకులు వచ్చినా వాళ్ళు కొంత కాలానికే పరిమితమై పోయారు.మళ్లీ బాలు లాగా లాంగ్ కెరీర్ వున్న తెలుగు గాయకుడు కనపడకపోవటం విచారకరం. వచ్చిన వాళ్ళెవరు ఎక్కువ కాలం నిలబడలేక పోవటానికి కారణం అంతుబట్టటం లేదు...మహిళా గాయనీమణులలో కూడా ఇదే పరిస్థితి. చిత్ర గారి తరువాత కొంతకాలం పాటు ఉష రాజ్యమేలింది. కాని ఆ తరువాత మళ్లీ అదే పరిస్థితి...అయితే మగవాళ్ళ కంటే ఫిమేల్ సింగర్స్ ది కొంచెం బెటర్.సునిత, కౌసల్య లాంటి వాళ్ళు కాస్తో కూస్తో బండి లాగుతున్నారు. 
అలాగే హీరోయిన్లలో సౌందర్య తరువాత కూడా ఇదే పరిస్థితి... టాలెంట్ లేకకాదు...నిలకడ లేక...చాలామంది ముంబాయి హీరోయిన్లు బాలివుడ్ లో అవకాశాలు దొరక్క అక్కడ ఎదిగేందుకు తెలుగు సినిమాను ఒక మెట్టులాగా వాడుకుంటున్నారు. ఇది ఎవరినీ విమర్శించటం కాదు.. ఏ రంగంలో అయినా రిప్లేస్ మెంట్ అనే దాన్ని గురించి మాట్లాడుకోవటం సహజం. దానికి ఫలానా వారు అనే బదులు ఫలానా వాళ్ళు అనే సమాధానం వస్తోంది. అయినా ఒక్కరే వుండాలన్నది రూలు కాదు.. ఎక్కువ మందికి అవకాశాలు రావటం మంచిదే...అవసరం కూడా. అయితే వచ్చిన అవకాశాలను వాళ్ళు ఎక్కువ కాలం నిలుపుకోలేక పోతున్నారనేది బాధ....కొంతమందిది స్వయంకృతం అయితే మరి కొంతమందిది జాతకం అని ఓ ఫ్రెండ్ అన్నాడు. అది నిజమేనేమో తెలియదు.అయితే అన్ని రంగాల్లోనూ మనవాళ్లకంటే పరాయి భాషల వారిని ప్రోత్సహించటం ఎక్కువైపోయింది కాబట్టి ఈ పరిస్థితి అని నా అభిప్రాయం.. తెలుగు టాలెంట్ ను మన పెద్దలు ప్రోత్సహిస్తే ఈ దౌర్భాగ్యం వుండదేమో...      











7 కామెంట్‌లు:

  1. అన్నగారూ!

    మీ ఆవేదనని బాగానే వెలిబుచ్చారు.

    "తరవాత యెవరు" అనేది కాలమే నిర్ణయిస్తుంది కదా!

    "పెద్దన్న" ఎన్ టీ ఆర్ కి వారసులు (వాళ్ల కుటుంబం నుంచే కాకుండా) కుప్పలు తెప్పలుగా వున్నారు మన తెలుగు సినీ ప్రపంచం లో.

    ఇక గాయకులూ, గాయనీమణుల విషయానికి వస్తే, పాపం "బాలు" చమటోడుస్తున్నాడు, తన "పాడుతా తీయగా" వగైరా కార్యక్రమాల ద్వారా!

    "అయినా...........?" అని క్రొశ్నిస్తే.......

    ఆ గాయనీ గాయకుల దగ్గరనించీ--"ఇండియన్ ఐడల్"ల వరకూ, పాత పాటలు (పాత గాయకుల గొంతుతో కాకుండా) తమ స్వంత గొంతుతో యెంత చక్కగా పాడుతున్నారు!

    మరి, ఇప్పుడు ఇలాంటి వాళ్ల చేత కూడా, వాళ్ల సొంత గొంతులు నొక్కేస్తూ, పాత పాటల 'రీ మిక్స్ ' ల లో సైతం, "ఓయ్ ఓయ్ ఓయ్; సోయ్, సోయ్, సోయ్; డోయ్; డోయ్; డోయ్" అంటూ--సీనారేకు మీద దువ్వెన్న తో గీకితే వచ్చే శబ్దం లా "రికార్డు" చేస్తున్నదెవరు?

    ప్రస్తుత సో కాల్డ్ మెలోడీ పాటల్లో సైతం యెవరిదైనా సొంత గొంతుకా, సాహిత్యం, స్వరాలూ వినిపిస్తున్నాయా?

    "స్వయం కృతం", "జాతకం" ల కన్నా, వీళ్లని ఇలా వాడుకుంటున్నవాళ్లది కాదూ ఈ "దుష్కృతం?"

    మంచి టపా వ్రాసారు. సంతోషం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. సర్,
    ఇది ఈ బ్లాగు రచయిత ప్రముఖ నటుడు, రచయిత, వ్యాఖ్యాత, దర్శకుడు అయిన శ్రీ ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం (ఎవియస్) గారే అనుకుని ఇస్తున్న కామెంట్. తెలుగు వాళ్లకు తెలుగువాళ్ళే అవకాశాలు ఇవ్వటం లేదన్న మీ అభిప్రాయం అక్షర సత్యం. కానీ నాదో చిన్న సందేహం మీరు దర్శకత్వం వహించిన చిత్రాలలో ఎంతమంది తెలుగు నటీమణులకు అవకాశం ఇచ్చారు? తప్పుగా అడిగితే క్షంతవ్యుడను.

    రిప్లయితొలగించండి
  3. ఎవరో ఒకరు మాత్రమే ఏకఛక్రాధిపత్యంగా ఏలకుండా ప్రతిభ ఉన్న గాయనీ గాయకులందరికీ సమాన అవకాశాలు దొరికితే బాగుంటుందని నా అభిప్రాయం. ఒక్క కళాకారుడే అందర్నీ డామినేట్ చేయకుండా పరిశ్రమలో ప్రజాస్వామ్యం నెలకొంటుంది. ఇదే నియమం ఏ రంగానికైనా వర్తిస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. మీ ప్రశ్నకు సమాధానం మీ ప్రశ్నలోనే ఉంది. మీరే సమాధానం ఒకచోట ఇచ్చారు. ఎవరైనా సుదీర్ఘ కాలం నిలబడాలంటే ముఖ్యం గా కావలసినది అంకిత భావం, దానితో పాటు కఠిన మైన పరిశ్రమ. ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ . ఒక సినిమా హిట్ కాగానే ' స్టార్ ' అయిపోతారు. తమని మించినవారు లేరనుకుంటారు. పతనానికి అది మొదటి మెట్టు. తరువాత కథ మామూలే !

    రిప్లయితొలగించండి
  5. నేనేమంటానంటే: అసలు ఈ పీత స్వభావం మన జాతి లక్షణమని. ఒక అమీబా రెండై, నాలుగై, చీలిపోవడమే లక్ష్యంగా పోతున్నట్టు, తెలుగు జాతి అనైక్యతకు మారు పేరుగా భాసిల్లుతోంది. వేరే వాళ్ళ నించి తెలుగు పేరు చెప్పి విడి పోతాం. విడిపోయిన తరవాత ప్రాంతాల వారీగా విడిపోతాం. అప్పుడు కులాల వారీగా చీలిపోతాం. దరిమిలా శాఖలవారీగా వేరైపోతాం. అప్పుడు కుటుంబాలవారీగా, చుట్టరికాల పేరుచెప్పి .... ఇలా వేరు కుంపట్లు మనకి సహజ కవచ కుండలాలు. సినీమా రంగం దీనికి భిన్నం కాదు. "మనవాడు కానివాడు" పైకి రాకూడదు. మనవాడు ఎలాపోయినా.

    నేను ఈ మధ్య ఇంకో ట్రెండు గమనించాను. బ్రహ్మానందానికి పద్మశ్రీ, గిన్నెస్ రికార్డు గుర్తింపు వచ్చిన తరవాత తను చేస్తున్న పాత్రల్లో అధిక భాగం ఏమీ రాని అమాంబాపతు వాళ్ళచేతిలో కూడా తన్నులూ బూతులు తినడం. అదే సమయంలో వివేక్ కి కూడా పద్మశ్రీ వచ్చింది కానీ తనకి ఇంత అపభ్రంశమైన రోల్స్ రావడం లేదు. ప్రోత్సాహం మాట ఎలా ఉన్నా "నొక్కడం" మన పరిశ్రమకే సొంతమైన ప్రత్యేకత అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  6. తెలుగు వరికే సొంతమైన పద్యం ఘంటసాల గారి తర్వాత కరువైపొయింది.......

    రంగులరాట్నం చిత్రం లో నాయిక పక్క గది లో చీర కట్టుకుంటునప్పుడు నయకుడు.. ఎక్కడ ఆని ప్రశ్నించినప్పుడు చీర కట్టుకుంటునా అని అనే మటలను తొలగించరట రెడ్డి గారు ఆ మాటకు ప్రేక్షకుడికి ఉహ తప్పుగ వస్తుందని అటువంటి నిర్మాత దర్శకులు లేరు...

    నా పాటకు న్యాయం చెయలి..మంచి పాట అందించాలి ...సజీవమైన పాట ఆదించలనే..సంగీత దర్సకులు లేరు .....

    పాడిన పాట బ్రతకాలి ...అని పాటను నేర్చుకు పడి ఫాటను ఆనుభవించి పడే గాయకులు ఆరుదు ....

    అందుకే తెలుగు పాట ఆంటే .. పాత పాట ...ఇప్పటికి పారిజాత కుసుమాలు .....

    ఇలా చెప్పుకుంటూ పొతే ఏన్నొ ..ఆపట్టి ప్రేక్షకుడి అభిమానం వేరు ఇప్పుడు వేరు ...

    ఇలాంటి మా జెనరేషణ్ లు ఏన్ని వచ్చినా ...పాత పాట సంజీవని..

    పరిశ్రమ మారాలి...ప్రజలను మార్చాలి.....తెలుగుతనం బ్రతకాలి

    నా అభిప్రాయం చెప్పాను ..అన్యదాభావించవద్దు

    హరీష్

    భ్యాంక్ ఆఫ్ శ్రీ ఘంటసాల

    రిప్లయితొలగించండి