పేజీలు

గురువారం 15 మార్చి 2012

రధం ఎక్కేది ఎవరు ???



  ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియదు గాని ప్రస్తుతం జరుగుతున్న ఉపఎన్నికలు మాత్రం సార్వత్రిక ఎన్నికలను మించిన ఉద్రిక్తంగా, సీరియస్ గా జరుగుతున్నాయి... అన్ని పార్టీల నాయకులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు...ప్రచారం చేస్తున్నారు. గెలుపు విషయంలో ఎవరికి వాళ్ళు ధీమాగా వున్నారు. అన్ని శక్తులు ఒడ్డుతున్నారు. ఎత్తులు, జిత్తులు, పై ఎత్తులు మామూలే... తెలంగాణా లో జరుగుతున్న ఆరు స్థానాలు తెలంగాణా వాదం నేపధ్యంలో జరుగుతున్నవి కాబట్టి తామే ఈ పోరులో గెలుస్తామని టి ఆర్ ఎస్ భావిస్తోంది...అసలు ఈ ఉపఎన్నికలు దాపురించింది టి ఆర్ ఎస్ వల్లనే అని, టి ఆర్ ఎస్ పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, కే సి ఆర్ తన కుటుంబం కోసం ఉద్యమాన్నితాకట్టు పెట్టాడన్న విషయం  తెలంగాణా ప్రజలకు అర్ధమైపోయిందని ప్రత్యర్ధి వర్గాలు ఆశగా వున్నాయి. అలాగే  తెలంగాణా ఊపు కుడా తగ్గిందని వాళ్ళు నమ్ముతున్నారు. రాజీనామాలు చేసి మళ్లీ       అక్కడే పోటి చేయటం త్యాగం ఎలా అవుతుందని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఉప ఎన్నికలు కే సి ఆర్ కు మ్యానరిజం గా మారాయని వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే చాలా దయనీయంగా మారింది. తెలంగాణా తెచ్చేది మేమే...ఇచ్చేది మేమే...అంటున్నారే కాని...కేంద్రం ఎప్పుడు తెలంగాణా ఇస్తుంది... అసలు తెలంగాణా ఇస్తుందా.. ఇవ్వదా..
అన్న ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు.... ఏదో నెట్టుకు రావడం మినహా వాళ్ళ దగ్గర ప్రత్యేకమైన పబ్లిసిటి వ్యూహం లేదు. కోవూరులో జగన్ ను ఎలాగయినా ఓడించటం అనేది ప్రస్తుతం కాంగ్రెస్ ముందున్న ప్రధాన చాలెంజ్...  తెలంగాణాలోని ఆరు సీట్లలో ఓడిపోయినా పర్లేదు గాని జగన్ గెలవకుండా వుంటే చాలు అన్నది కాంగ్రెస్ భావనగా కనిపిస్తోంది... 
    తెలుగుదేశం ఆలోచనా ధోరణి వేరుగా వుంది... గతంలో బాన్సవాడ  ఉపఎన్నికలలో పోటీ చేయకపోవడంలో నాలిక కరుచుకున్నదేశం పార్టీ ఈ సారి ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకుని  ఆ మేరకు తన అభ్యర్ధులను రంగంలోకి దించింది.  గెలవకపోయినా పరవాలేదు...మెరుగైన మెజారిటి వస్తే చాలు...టి ఆర్ ఎస్ కు గర్వభంగం జరుగుతుంది అనేది దేశం ఆలోచనగా కనిపిస్తోంది... ఈ మేరకు టి డి పి ప్రయత్నం సఫలీకృతమవుతుందని, రెండు మూడు చోట్ల దేశం గెలిచినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు మీడియా లో వ్యాఖ్యానిస్తున్నారు. వామ పక్షాల సంగతి సరే... వాళ్ళ వ్యూహం అగమ్యగోచరంగా వుంది.... ఇక జగన్ సంగతికొస్తే... తెలంగాణా లో మన వల్ల కాదు అనుకున్నారో ఏమో ఆయన  తెలంగాణా లో ముందే  చేతులు  ఎత్తేసారు .మిగిలిన వాళ్ళ సంగతి ఎలా వున్నా జగన్ కు మాత్రం కోవూరు లో గెలవటం అనివార్య లక్ష్యం...లేకపోతే నైతికంగా ఆయన పరిస్థితి, ఇమేజ్ పరంగా ఆయన పార్టి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారతాయి.. ఇవాళ రాష్ట్రం యావత్తూ తెలంగాణా వైపు చూడటంలేదు....కోవూరు వంక చూస్తోంది... దాదాపు అన్ని పార్టిలవాళ్ళు తమకు ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారని చెబుతున్నారు....ఎవరెన్ని చెప్పినా ఓటరు బ్రహ్మలు ఎవరిని రధం ఎక్కిస్తారో చూడాలి....అందుకే అందరికీ ఆల్ ది బెస్ట్.....!!





శుక్రవారం 9 మార్చి 2012

మళ్లీ మరోసారి...సారీ....!!

    


         ఈ ఏడాది తెలుగు సినిమాలకు వేటికీ జాతీయ అవార్డులు రాలేదన్న బాధ అందరితో పాటు నాకూ అమితంగానే వుంది....ఏదో ఒక సినిమాకు నేషనల్ అవార్డు రాకపోతుందా... తెలుగు సినిమా పరువు నిలవక పోతుందా అని నేను కూడా ఎంతగానో ఎదురు చూసాను... నిరాశ తప్పలేదు...అసలు జాతీయ అవార్డులు మన వైపు కన్నెత్తి కూడా చూడలేదు... ఎందుకు అవార్డులు రాలేదు అంటే... రాలేదు...అంతే....అక్కడ ప్రశ్నాలేదు...సమాధానమూ లేదు..నార్తు వాళ్ళు ...తమిళ  మళయాళ  సినిమాల వాళ్ళకున్న లాబీలు మనకు లేవు అనో...మన పార్లమెంట్ సభ్యులు అసలు పట్టించుకోవటం లేదనో ఈ సందర్భంగా వినిపిస్తున్న వ్యాఖ్యలు నా దృష్టిలో పస లేని వాదనలు... అవార్డు రాకపోవటం బాధాకరమే...కాని అందుకు గల కారణాలను ఆత్మ విమర్శతో ఆలోచించాలే గాని...సంకుచిద్తంగా కాదన్నది నా ఉద్దేశ్యం...లాబీలు లేవనో, ఎంపిలు లేరానో కారణాలు హాస్యాస్పదం... అలా వచ్చేవి అవార్డులా... అవి మనకు అవసరమా... అన్నది ప్రశ్న... ఈ వాదన మనల్ని మనమే అవమానించుకోవటం కాదా...? సహజత్వ పరంగా, సాంకేతికంగా, ఇతివృత్త పరంగా మనమూ, మన సినిమాలూ ఎక్కడ వున్నామన్నది ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం లేదా...? గత ఏడాది అవార్డుల ఎంపికకు వెళ్ళిన మన సినిమాలు తక్కువన్నది నా ఉద్దేశ్యం కాదు...ఒక శ్రీ రామ రాజ్యం, రాజన్న లాంటి మంచి సినిమాలు వెళ్ళాయి. 
అయితే మన సినిమాల గొప్పతనం గురించి మనకు తెలుసు...అవతల అవార్డులు వచ్చిన వాటి గురించి మనకు తెలియదు కదా.....మనకు రానప్పుడు ఏదో అన్యాయం...మోసం జరిగిందని అనుకోవటం సహజం...కాని క్రియేటివ్ రంగంలో వున్న సినిమా అలా ఆలోచించ కూడదన్నది  నా అంతరంగం...నా ఉద్దేశ్యంలో విద్యా బాలన్ కంటే రామ రాజ్యంలో నయనతార బాగా నటించింది.. శ్రీ రామ రాజ్యం లాంటి ఇతిహాసాన్ని బాపు గారు తప్ప భారత దేశంలో మరే దర్శకుడు అలా రూపొందించలేరు. .కాని న్యాయ నిర్ణేతలు నాలాగా ఆలోచించాలని లేదు కదా...వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరుగా వుంటుంది. మనం అలా స్పోర్టివ్ గా  ఆలోచించగలిగితేనే మంచిది... అన్ని విధాలా తెలుగు సినిమా రేంజ్ గతంతో పోలిస్తే పెరిగింది...అందులో సందేహం లేదు....అయితే కదల ఎంపిక విషయంలో మనం మరింత జాగరూకత వహిస్తే  జాతీయ అవార్డులు ప్రకటించిన  ప్రతిసారీ ఇలా బాధపడాల్సిన అవసరం వుండదు....!






 
 

గురువారం 8 మార్చి 2012

వర్మ గారు....బ్రాహ్మణ శాపం పవర్ ఫుల్....!!

      
  
      నాలుగయిదు నెలలు ప్రశాంతంగా వున్నాం. మళ్లీ రాం గోపాల్ వర్మా, ఆయన తాలూకూ వివాదాలూ మొదలయినాయి. ' రెడ్డి గారు పోయారు ' అనో ' చౌదరి గారు పరారు ' అనో  ఆయన ఒక సినిమా ప్రకటించటం....
ఇక అక్కడినుంచి మీడియా దానిని పెద్దదిగా చూపటం.... ప్రధాన వార్తలలో దాని గురించి హైప్ చేస్తూ చెప్పటం పునరావృతమవుతోంది. వర్మ సినిమాల మిద లైవ్ షో లు, టాక్ షోలు, ఇంటర్వ్యులు తిరిగి మొదలయ్యాయి. వర్మ
ఏ సినిమా అయినా, ఎలాంటి సినిమా అయినా తీసుకోవచ్చు... క్రియేటర్ గా అది ఆయన హక్కు...దానిని అడిగే హక్కు ఎవరికీ లేదు...ఇష్టం లేని వాళ్ళు ఆ సినిమాలు చూడాల్సిన అవసరం లేదు.... వివాదాలతో కూడిన సినిమాలను అనౌన్స్ చేయటం రాం గోపాల్ వర్మ కు అలవాటు.... వ్యాపార పరంగా అది ఆయనకు అవసరం....ఆ పరంగా అయనను   నిలదిసేందుకు  ఎవరికయినా ఏమి హక్కు వుంటుంది.  అయితే  వర్మకు గొప్ప వరం  తెలుగు  మీడియా...ప్రచారపరంగా వర్మకు భగవంతుడిచ్చిన వరం. కొన్ని లక్షల విలువయిన పబ్లిసిటిని ఉచితంగా వర్మకు మీడియా ఇస్తోంది.  వర్మ తుమ్మినా, దగ్గినా అదొక వార్తగా మీడియా పరిగణిస్తోంది. నిరంతరం ఆయన్ను వార్తల్లో వ్యక్తిగా నిలబెడుతున్నాయి. ఆయనకు కూడా అంతకంటే ఏంకావాలి... ఇవాళ తాజాగా పూజారుల గురించి వర్మ గారు ట్విత్తర్ లో చేసిన వ్యాఖ్యలు బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బ తీసాయంటూ కొన్ని చానెళ్ళు లైవ్ షో లు పెట్టాయి. సాక్షాత్తు వర్మ గారు కుడా ఒక చానెల్లో కనిపించారు. ఎందుకిలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు అంటూ చానెల్ వారు ఆయన్ను అడిగారు...వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం కాదు....తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావాలనే ఆయన ప్రయత్నం...అది నెరవేరింది...అంతే....సింపుల్....బ్రాహ్మణులకు మంత్రాలకు అర్ధాలు తెలియవంతు వర్మ చేసిన వ్యాఖ్యలు ఎంత అర్ధ రహితమో మేధావి వర్మ గారికి మాత్రం తెలియదా....తన బారసాల దగ్గర్నించీ తన పిల్లల అక్షరాభ్యాసం వరకు బ్రాహ్మలు లేనిదే గడవదన్న కనీస పరిజ్ఞానం వర్మ గారికి ఉండదని ఎలా అనుకుంటాము...ఆయనకు అన్నీ తెలుసు...ఉత్తినే...ఉబుసుపోక ...అప్పుడప్పుడు ఇలాంటి కామెడి చేస్తుంటారు... అంతే... మరీ అంత కోపం వస్తే బ్రాహ్మణులను శపించమని చెప్పండి అంటున్నారు వర్మ గారు...వద్దు సర్...బ్రాహ్మణ శాపం చాలా శక్తివంతమైనది....తట్టుకోలేరు....మీ వివాదాలు సినిమాలకు పరిమితం కానివ్వండి...కులాలకు విస్తరింప చేయాలని చూడద్దు....!!!



బుధవారం 7 మార్చి 2012

నారాయణ...నారాయణా....!!!



         సి పీ ఐ నారాయణ గారంటే నాకు చాలా గౌరవం. నాకు ఇష్టమైన నాయకుడు కుడా. ఆయన మెయింటైన్ చేసే
 రాజకీయ పద్ధతులు కొన్ని ముచ్చటగా వుంటాయి. ఆయన స్టేట్ మెంట్లు కుడా చాలా హుందాగా, విభిన్నంగా, ఆలోచనాత్మకంగా వుంటాయి. నాకు మంచి మిత్రుడు కుడా... అయితే ఇటివలి కాలంలో ఆయన వ్యాఖ్యానాలు, ఆయన చేస్తున్న కామెంట్లు ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవు. ఆయన వ్యక్తిత్వం కూడా అది కాదు. ఆయన ఏమి చేసినా అది ఒక
వార్త....అదో సంచలనం.... ఒక రాజకీయ నాయకుడు చికెన్ తినటం కూడా కొంతకాలం పాటు మీడియా లో రాజ్యమేలింది అంటే ' అదీ నారాయణ అంటే..' అనుకున్నారు అందరూ... ఇక సైకిళ్ళు తోక్కటాలు, మోటారు సైకిళ్ళు నడపతాలు   లాంటివి చెప్పనే అక్ఖర్లేదు...ప్రతిదీ వార్తే....అవన్నీ పక్కన పెడితే....ఈ మధ్య కాలంలో నారాయణ గారు కొంచెం గాడి తప్పారా అనిపిస్తోంది...ఐ ఎ ఎస్ అధికారిణి  శ్రీ లక్ష్మి  గురించి గాని, అసెంబ్లీ ని పందుల దొడ్డి తో పోల్చటం గాని, నిన్నా మొన్నట్లో మంత్రి గీతా రెడ్డి గారి గురించి గాని, ఆయన చేసిన కామెంట్లు చాలా దారుణంగా వున్నాయి. నారాయణ ఇలా మాట్లాడుతున్నారేవిటి అని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ అసహ్యించుకుంటున్నారు. ఇంత పెద్ద మనిషి ఇలా ప్రవర్తిస్తున్నారు ఏమిటి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
నానా మాటలు మాట్లాడటం తరువాత నాలిక కరుచుకోవటం నారాయణకు మ్యానరిజం గా మారిపోయింది.
ఈ రోజు ఆయన గీతా రెడ్డి గారికి రాసిన క్షమాపణ లేఖ చూస్తే నారాయణ లాంటి నాయకుడికి ఇలాంటి పరిస్థితి అవసరమా అన్న ప్రశ్న ఎవరిలోనయినా  ఉత్పన్నం కాక మానదు. ఇది స్వయంక్రుతం... ఆయన పరిస్థితికి ఆయనే కారకుడు... ఒక జాతీయ పార్టికి మన రాష్ట్రంలో ప్రతినిధిగా వున్న నారాయణ లాంటి నాయకుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే కాదు... ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణా ఉప ఎన్నికలలో టి ఆర్ ఎస్ కు మద్దతు ఇస్తూ సి పీ ఐ నిర్ణయం తీసుకుంది. అంతవరకు బానే వుంది. అది ఆ పార్టి ఇష్టం. కాని మర్నాడే కే సి ఆర్ లాంటి వాణ్ని నమ్ముకుని భవిష్యత్తులో ఎలా ప్రయాణం చేయగలం అంటూ మాట్లాడటం ఆయన మానసిక పరిస్థితిని ప్రశ్నిస్తోంది. పైగా పార్టి బతకాలిగా అంటూ మాట్లాడటం చూస్తుంటే తన పార్టిని తనే చులకన చేసుకుంటున్నారా అనిపిస్తోంది. ఏది ఏమయినా ' అంతా బావుంటావు...అర్ధం కావు నారాయణా....' అన్నట్టు తయారైంది ప్రస్తుత పరిస్థితి. నారాయణ గారు...ఆలోచించండి సర్....కొన్ని మార్చుకోండి...!!!!





   





ఆదివారం 12 ఫిబ్రవరి 2012

ఎందుకీ ద్రోహం.....?


              జియ్యర్ స్వామి తిరుపతి దేవస్థానం గురించి చేస్తున్న వ్యాఖ్యలు, సృష్టిస్తున్న వివాదాలు నాకే కాదు...యావత్ హిందువుల మనోభావాలు దెబ్బ తీసేవిధంగా వున్నాయి.. అసలే హైందవ ధార్మిక వ్యవస్థ భవిష్యత్తు అగమ్య గోచరంగాను, ప్రశ్నార్ధకంగాను మారిపోతున్న ప్రస్తుత తరుణంలో జియ్యర్ స్వామి చేస్తున్న పని హిందూ మతానికి ఏవిధమైన మేలు చేయకపోగా మరింత కీడు చేసేదిగా ఉందనటం నిర్వివాదాంశం. పైగా ఆయన తిరుపతి దేవస్థానాన్ని వాటికన్ సిటి తో పోల్చి తక్కువ చేసి మాట్లాడటం, చర్చిలతో పోల్చి దేవాలయాలను పలుచన చేసేలా వ్యాఖ్యలు చేయటం దారుణం. అన్ని మతాలు గొప్పవే.. ఏ మతంలో వుండే గొప్పతనం ఆ మతంలో వుంటుంది..అలాగే హిందూ మతం గొప్పతనం హిందూమతానిదే. పొరుగింటి పుల్లకూర రుచి అన్న చందాన పక్క మతాలను గొప్పవిగా చేస్తూ హిందూ మతాన్ని తక్కువ చేయటం జియ్యర్ స్వామి లాంటి వారికి తగదు. 
తిరుపతి దేవస్థాన నిర్వహణలో ఏమయినా లోపాలు వుంటే వాటిని సరైన రీతిలో సదరు కమిటి కి తెలియపరచ వచ్చు... లేదా ప్రభుత్వం దృష్టికి తేవచ్చు. అలా కాకుండా తిరుపతి దేవస్థానం మీద యుద్ధం ప్రకటించటం, కొండ మీదకు ధర్మ యాత్ర పేరుతో దాడి చేయటం ఏమాత్రం క్షమార్హం కాదు.
పైగా వెంకటేశ్వర స్వామిని వేశ్యతో పోల్చటం, తిరుపతిని క్లబ్ తో సరిపోల్చటం
దారుణం..దుర్మార్గం.. ఈమాత్రం దానికి  శ్రీనివాస హోమాలేందుకు.. భాగవత సప్తాహాలు ఎందుకు...? జియ్యర్ స్వామి ఏదేదో మాట్లాడటం, దానికి ప్రతిగా  మరో  స్వామిజి  ఇంకేదో మాట్లాడటం, ఈ నేపధ్యంలో టివి చానెళ్ళ వాళ్ళు చర్చా వేదికలు పెట్టి నానా యాగి చేయటం...ఏమిటిదంతా...? ఎందుకు ఈ సిద్ధాంత రహిత రాద్ధాంతాలు...?  '' దేవుడా...రక్షించు నా హిందూ ధర్మాన్ని...మత ప్రచారకుల నుంచి...ప్రచార ఆర్భాటకుల నుంచి...."


 


శుక్రవారం 20 జనవరి 2012

నవ్వుల కార్మికుడు ఈవివి.....!

డైరెక్టర్ ఇ.వి.వి. గారు చనిపోయి అప్పుడే ఏడాది అయిపోయింది. కాలం ఇంత వేగంగా గడిచి పోతుందా  అనిపిస్తోంది... ఆయన లేకపోయినా ఆయన పండించిన నవ్వులు, ఆయన అందించిన ఆణిముత్యాల్లాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎవరూ మరచిపోలేరు...తన గురువు జంధ్యాల గారి లాగానే ఈ వి వి కూడా అన్ని రకాల సినిమాలను రూపొందించి తన బహుముఖ ప్రజ్ఞాశాలిత్వాన్ని నిరూపించుకున్నారు. జంబలకిడిపంబ,
కితకితలు, ఎవడి గోల వాడిది, లాంటి పక్కా కామెడి సినిమాలు               మాత్రమే   కాక ఆమె, అమ్మో ఒకటో తారీఖు లాంటి సందేశాత్మక  సినిమాలకు   కూడా దర్శకత్వం నెరపారు.. హాస్యానికి తన చిత్రాలలో  పెద్ద పీట వేసే ఈ దర్శక శ్రేష్టుడు తెలుగు  సినిమా చరిత్రలో  తనకంటూ చాలా పేజీలు కేటాయించుకున్నారు..ఆయన లేకపోవటం తెలుగు కామెడి సినిమాలకు మాత్రమే కాక కామెడి కుటుంబానికి కూడా  తీరని  లోటు.. జంధ్యాల గారి తరువాత చాలా వరకు ఆ స్థానాన్ని భర్తీ చేసిన
ఈ వి వి  గారు సినిమా తెర మిద నవ్వులున్నంత కాలం గుర్తుంటారు.
డైరెక్టర్ గారూ... మీరు మళ్లీ పుట్టండి సర్.... మీరు పండించాల్సిన నవ్వులు ఇంకా మిగిలివున్నాయి...



 నవ్వుల కార్మికుడు ఈవివి.....!

శనివారం 19 నవంబర్ 2011

మన బంగారం మంచిదయితే చాలు....!


గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక అనారోగ్యకర వాతావరణం నెలకొంది. రికార్డు కలెక్షన్లు అనే నేపధ్యంలో ఇద్దరు పెద్ద హీరోల అభిమానుల మధ్య చిన్న సైజ్ యుద్ధం జరుగుతోంది. మాదే రికార్డు అని ఒకరు, కాదు మాదే రికార్డు అని మరొకరు పరస్పరం సవాళ్లు విసురుకోవటం ఉద్రిక్త పరిస్థితులు సృష్టించుకోవటం చూస్తుంటే బాధ కలుగుతోంది...చివరకు ఈ వివాదం ముదిరి పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనల వరకు  వెళ్లిందంటే ఆందోళన కలుగుతోంది కూడా...ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధించింది...ఇప్పటివరకు ఏ సినిమా ఇంతటి వసూళ్ళు చేయలేదు...రికార్డులు బద్దలు కొట్టింది...అని ఎవరయినా ప్రచారం చేసుకున్నారంటే అది వారి అమాయకత్వమో లేక మితి మీరిన ఆత్మ విశ్వాసమో అయివుండాలి. నిర్మాణ వ్యయం, టికెట్ల రేట్లు, ఆర్టిస్టుల పారితోషికాలు, ప్రచారం ఖర్చు లాంటివి అనూహ్యంగా పెరిగిపోతున్న ఈ సమయంలో ఏ విధంగా నిన్నటి సినిమాకు, ఇవాల్టి సినిమాకు పోలిక చూపెడతారన్నది ప్రశ్న. మాయా బజార్ సినిమా నాటికి మగధిర సినిమా నాటికి తేడా లేదా....?  లవకుశ సినిమా రోజులకు దూకుడు సినిమా రోజులకు వ్యత్యాసం లేదా....?  ఆ రోజు ఖర్చుకు...లాభాలకు.... ఈ రోజు ఖర్చుకు... లాభాలకు  తేడా లేదూ....? ఎలా యాభయి ఏళ్ళ  చరిత్రలో రికార్డు అనే పదాన్ని వాడతారో అర్ధం కాదు... సరే... సినిమా ప్రమోషన్ కు సవా లక్ష ప్రచారాలు చేసుకోవటం తప్పు కాదు....పైగా అద్భుతమైన కలెక్షన్లు వసూలు చేస్తున్న సినిమాలకు అదేమంత ఆక్షేపణియము కూడా కాదు..అయితే ఇది శ్రుతి మించటం వల్లనే ఈ పరిస్థితులు దాపురిస్తున్నాయి...కాని ఒక్క విషయం...ఈ జాడ్యం ఇవాల్టిది కాదు...మా హిరో గొప్ప అంటే మా హిరో గొప్ప అని అభిమానులు కొట్టుకోవటం కొత్తేమి కాదు..మన సినిమాకు, మన రాష్ట్రానికి పరిమితమైనది కూడా కాదు...అయితే కొంచెం నిశితంగా పరిశిలిస్తే ఇటివలి వివాదం కేవలం " సినిమా " " అభిమానం " అనే పరిధులు దాటి వేరే అనారోగ్యకర దారుల్లోకి పయనిస్తోందనిపిస్తోంది. ఇది ప్రమాదకరం..ఈ మొత్తం అంశంలో తప్పు హిరోలది కాదు...అభిమానులది కాదు...అత్యుత్సాహంతోనో...విజయోత్సాహంతోనో కొంచెం గీతలు దాటి ప్రకటనలు, ప్రచారాలు చేస్తున్న కొందరు నిర్మాతలే ఈ పరిస్థితికి కారకులన్నది స్పష్టంగా కనిపిస్తోంది....బాధ్యత గల నిర్మాతలు  ఎవరూ ఇటువంటి వాటిని ప్రోత్సహించరన్నది నిర్వివాదాంశం. " మా సినిమా 
గొప్పది " అన్నంతవరకు సమస్య లేదు..తప్పూ లేదు. " పక్కవాడి సినిమా కంటే నా సినిమా గొప్పది " అన్నప్పుడే సమస్య తలెత్తుతుంది...మనం గొప్పవాళ్ళం అన్నది గుండె మిద చెయ్యి వేసుకుని చెప్పగలిగితే అది విజయం...పక్కవాడి కంటే నాది గొప్పది అని తోడ కొట్టి చెపితే అది అహంభావం... ఈ తేడా తెలుసుకుని కొంచెం బాధ్యతగా మెలగ గలిగితే 
పరిశ్రమ బావుంటుంది...హీరోలు బావుంటారు...అభిమానులు బావుంటారు...
అందరు బావుంటారు...మనకు ఎన్ని ఎకరాలు ఉన్నదో చెప్పుకోవటంలో తప్పు లేదు...పక్కోడికి ఎన్ని ఎకరాలు వుంటే మనకెందుకు ???