ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియదు గాని ప్రస్తుతం జరుగుతున్న ఉపఎన్నికలు మాత్రం సార్వత్రిక ఎన్నికలను మించిన ఉద్రిక్తంగా, సీరియస్ గా జరుగుతున్నాయి... అన్ని పార్టీల నాయకులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు...ప్రచారం చేస్తున్నారు. గెలుపు విషయంలో ఎవరికి వాళ్ళు ధీమాగా వున్నారు. అన్ని శక్తులు ఒడ్డుతున్నారు. ఎత్తులు, జిత్తులు, పై ఎత్తులు మామూలే... తెలంగాణా లో జరుగుతున్న ఆరు స్థానాలు తెలంగాణా వాదం నేపధ్యంలో జరుగుతున్నవి కాబట్టి తామే ఈ పోరులో గెలుస్తామని టి ఆర్ ఎస్ భావిస్తోంది...అసలు ఈ ఉపఎన్నికలు దాపురించింది టి ఆర్ ఎస్ వల్లనే అని, టి ఆర్ ఎస్ పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, కే సి ఆర్ తన కుటుంబం కోసం ఉద్యమాన్నితాకట్టు పెట్టాడన్న విషయం తెలంగాణా ప్రజలకు అర్ధమైపోయిందని ప్రత్యర్ధి వర్గాలు ఆశగా వున్నాయి. అలాగే తెలంగాణా ఊపు కుడా తగ్గిందని వాళ్ళు నమ్ముతున్నారు. రాజీనామాలు చేసి మళ్లీ అక్కడే పోటి చేయటం త్యాగం ఎలా అవుతుందని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఉప ఎన్నికలు కే సి ఆర్ కు మ్యానరిజం గా మారాయని వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే చాలా దయనీయంగా మారింది. తెలంగాణా తెచ్చేది మేమే...ఇచ్చేది మేమే...అంటున్నారే కాని...కేంద్రం ఎప్పుడు తెలంగాణా ఇస్తుంది... అసలు తెలంగాణా ఇస్తుందా.. ఇవ్వదా..
అన్న ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు.... ఏదో నెట్టుకు రావడం మినహా వాళ్ళ దగ్గర ప్రత్యేకమైన పబ్లిసిటి వ్యూహం లేదు. కోవూరులో జగన్ ను ఎలాగయినా ఓడించటం అనేది ప్రస్తుతం కాంగ్రెస్ ముందున్న ప్రధాన చాలెంజ్... తెలంగాణాలోని ఆరు సీట్లలో ఓడిపోయినా పర్లేదు గాని జగన్ గెలవకుండా వుంటే చాలు అన్నది కాంగ్రెస్ భావనగా కనిపిస్తోంది...
తెలుగుదేశం ఆలోచనా ధోరణి వేరుగా వుంది... గతంలో బాన్సవాడ ఉపఎన్నికలలో పోటీ చేయకపోవడంలో నాలిక కరుచుకున్నదేశం పార్టీ ఈ సారి ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకుని ఆ మేరకు తన అభ్యర్ధులను రంగంలోకి దించింది. గెలవకపోయినా పరవాలేదు...మెరుగైన మెజారిటి వస్తే చాలు...టి ఆర్ ఎస్ కు గర్వభంగం జరుగుతుంది అనేది దేశం ఆలోచనగా కనిపిస్తోంది... ఈ మేరకు టి డి పి ప్రయత్నం సఫలీకృతమవుతుందని, రెండు మూడు చోట్ల దేశం గెలిచినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు మీడియా లో వ్యాఖ్యానిస్తున్నారు. వామ పక్షాల సంగతి సరే... వాళ్ళ వ్యూహం అగమ్యగోచరంగా వుంది.... ఇక జగన్ సంగతికొస్తే... తెలంగాణా లో మన వల్ల కాదు అనుకున్నారో ఏమో ఆయన తెలంగాణా లో ముందే చేతులు ఎత్తేసారు .మిగిలిన వాళ్ళ సంగతి ఎలా వున్నా జగన్ కు మాత్రం కోవూరు లో గెలవటం అనివార్య లక్ష్యం...లేకపోతే నైతికంగా ఆయన పరిస్థితి, ఇమేజ్ పరంగా ఆయన పార్టి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారతాయి.. ఇవాళ రాష్ట్రం యావత్తూ తెలంగాణా వైపు చూడటంలేదు....కోవూరు వంక చూస్తోంది... దాదాపు అన్ని పార్టిలవాళ్ళు తమకు ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారని చెబుతున్నారు....ఎవరెన్ని చెప్పినా ఓటరు బ్రహ్మలు ఎవరిని రధం ఎక్కిస్తారో చూడాలి....అందుకే అందరికీ ఆల్ ది బెస్ట్.....!!

